ఒక మారుమూల ఊళ్ళో కొద్దిమంది మంచి పద్యకవులు ఉండేవారు. ఆ కవులు కూడా యెక్కడనో మారుమూల ఉండేవారు. పద్యకవుల కోసం మోటారుబళ్ళమీద ఊళ్ళను వచనకవులు గాలించారు. అంత గాలించిన ఆ పద్యకవులనేవారు ఒక పట్టాన కనిపించలేదు. వచనకవులు సర్వప్రపంచము, పేడముద్దల్లో దాగున్న ప్రతి వచనమును తాము కనుగొన్నామని అనుకొన్న తరువాత ఆ పద్యకవులు ఇక్కడ ఉన్నారని తెలుసుకునేందుకే కొన్ని పదుల యేండ్లు పట్టినవి. తెలుసుకోటమే ఆలస్యము.తుపాకులు, మట్టిబెడ్డలు తీసుకుని, భూతాలు, పిశాచాలు, బేతాళలను వెంటబెట్టుకొని నిర్భావాలు, దుర్భాష లతో అక్కడికి చేరినారు. ఆ ఊరు కూడా డిటో ప్రకారం అయింది.
అయితే ఆ ఊళ్ళో వాళ్ళు వచన ప్రపంచంలో గండూషించబడుతున్న పైత్యము సంగతి ఎరుగక కొన్ని వేల రెట్లు ఎక్కువ ఆనందం అనుభవించారు.అందుచేత వాళ్ళు ఈ బేతాళ రచయితల భాషావాసన అంతతేలికగా అలవాటు చేసుకోలేకపోయినారు. ఇతరచోట్లకు మల్లేనే అక్కడా తిరుగుబాట్లు, మరఫిరంగులు, కాల్పులు.
ఒక వచనకవితా కపినాయకుడు ఆ ద్వీపానికి కవితా నియంత అయినాడు. అతడు ఒక కొండముచ్చు. దానికితోడు బ్రహ్మచారి. అనగా అవివాహితుడన్నమాట. ఆ ఊరు ఉష్ణమండలాల్లో ఉండటం మూలాన అక్కడి జనులు తెల్లనివారు. చర్మము తెల్లన. భాష తెల్లన. అనగా స్వచ్ఛము.భాషాశక్తివంటిది వాళ్ళకు మహాగౌరవము. భాషను నేలక్రింద పడవేసి రాయరు. భావాన్ని కలంక్రింద బెట్టి త్రొక్కరు. పద్యావయములను కావలసినంత మాత్రము కప్పుగొంటారు. వచనకవులై దురదగొండాకు కప్పుకోరు. ఈ యనాగరక పద్యకవులు నాగరకులయ్యే రోజులు వచ్చి ఆ ఊరు నాగరకుల కంట బడ్డది.
వచనకపితా నియంత ఒక పద్యకవయిత్రిని చూచాడు. ఆతరువాత ఆమె రాసిన పద్యాలను చదివినాడు. ఆమె భాష అతని కళ్ళు పట్టరాకుండా ఉండిపోయింది. ఆ సాయంత్రం ఆవిడ మొగుడికి కబురు పంపించాడు. నీ భార్యను, ఆమె రాసిన పద్యాలను నాకు తోలిపెట్టమని. ఆ జీవుడు యేమి చేస్తాడూ? ఇదివరకే తమ ఊళ్ళో జరిగిన ఘోరాలు అతనికి తెలుసు. అయినా జీవుడు పెనుగులాడటం స్వభావం. అది అన్యాయమని, తన ప్రాణము పోయినా తాను తన భార్యను వదిలిపెట్టనని కబురంపించాడు. నియంతకు కోపం వచ్చింది. పదిమంది వచనకవులు, కవితలతో వాని యింటికి వెళ్ళాడు. అతడు వీళ్ళు వస్తారని తెలిసి పద్యము రాయుటకుపయోగపడు ఛందస్సును, మంచి భాషను, భావమును తానొకటి, తన పెద్దకొడు కొకటి చేతులలో పుచ్చుకొని, తమ గుడిసెముందర నిలుచున్నారు. వారి భాషాధారణను, వాళ్ళను చూస్తే నియంతకు నవ్వు వచ్చింది. అతడు "ఎందుకు నవ్వుతావు" అని యడిగాడు. నియంత యిట్లా అన్నాడు "ఓరి మూర్ఖుడా! మా వచనమ్ముందు నీ భాషా, ఆ పద్యపుపుల్లలు నిలుస్తవా?" అని. అతడన్నాడు కదా " నా భాష నీ తుపాకులకు సమాధానము చెపుతవని గాదు, నేనీ పుల్లలు పుచ్చుకొన్నది. నా భావము నీ భావమునకు సమాధానం చెప్పవలెనని కాని మరొక దానికి గాదు" అని
నియంతకు కోపం వచ్చింది. ఒక్క వచనకవిత విసరినాడు.
మధ్యాహ్నపు ఎండలో నడిచొస్తే కాళ్ళు కాలాయి, కాలిన చోట గుంటూరు కారము పూసినాను అని యనినాడు. అనిన పిదప ఆ గుడిసెలో ప్రవేశించబోయినాడు. పెద్దకొడుకు అడ్డము పడి నా భావము విని ఆ తర్వాత నా శవము మీదుగానే నీవు గుడిసెలోకి వెళ్ళగలవు యనినాడు.
నియంత కత్తి బయటకు తీసినాడు. ఆకత్తి బహు పదునుగా తళతళ మెరుస్తున్నది. అయినను కుర్రవానికేమి భయము? భావము బుర్రలో యున్నది. చెప్పుటకు నోరు యున్నది. నియంతతో ఇట్లనినాడు. మధ్యాహ్నపు ఎండలో నడిచొచ్చిన కాళ్ళకు చందనము పూసితిని యని.
నియంత ఆగ్రహోదగ్రుడై కత్తి విసరినాడు. అడ్డగించబోయిన తండ్రి తల, ఆ వెనక కొడుకు తల తెగిపోయినవి. నియంత గుడిసెలో ప్రవేశించి అతని భార్యను, ఆమె పద్యములను తీసుకురాబోయినాడు. ఆ స్త్రీ, భర్త శవం, కొడుకు శవం మీదబడి యేడవటం మొదలుపెట్టింది. వచనకవులు శవాలను, పద్యాలను తీసుకొనిపోయిరి.గోబరుగాసుప్లాంటునందు పారవేశారు.
ఆమె భాషను పట్టుకొని యేడవటం మొదలుపెట్టింది. వచనకవులు నియంత ఆజ్ఞతో భాషను ఆ తల్లిచేతుల్లోంచి లాక్కుని వందసార్లు విదిలించి వేయగా వేయగా ఆ భాషకు దెబ్బలు తగిలి ఉస్సురని ప్రాణాలు కడపట్టినవి. ఆ స్త్రీ కొనయూపిరితోనున్న భాషతో నియంత యింటికి వెళ్ళింది.
ఈ కథ జరిగి అయిదేళ్ళయింది. ఆ స్త్రీ కొనవూపిరితో యున్న భాషను ఎటులనో బ్రతికించుకొని ఆ భాషతో కాలం పుచ్చుతోంది. ఒక రోజున నియంత వచ్చాడు
నియంత - ఆ భాష కూడ పోతేగాని నీవు నాతో సరిగా ఉండవు
స్త్రీ - నీకన్న కర్కోటవుడవు నీవే! నీవు మనుష్యుడవు కావు. ఈ మిగిలివున్న భాష ప్రాణములు కూడా తీస్తావా?
(ఇంకా వుంది........)